
హిట్ కాంబోలను రిపీట్ చేయడంలో బాలకృష్ణ ముందుంటారు. సక్సెస్ ఇచ్చిన దర్శకులు, ఆయనకు నచ్చిన దర్శకులతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఇప్పటికే బోయపాటి శ్రీనుతో మూడో చిత్రంగా ‘అఖండ2’లో నటిస్తున్నారు బాలకృష్ణ. తాజాగా మరో క్రేజీ కాంబోను రిపీట్ చేయనున్నట్టు ఆదివారం ప్రకటించారు. బాలకృష్ణతో ‘వీర సింహారెడ్డి’లాంటి హిట్ సినిమాను రూపొందించిన గోపీచంద్ మలినేనితో తన 111వ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలియజేశారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నట్లు టాక్.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ‘రోరింగ్ బ్లాక్ బస్టర్ కాంబో తిరిగి వస్తుంది. హిస్టారికల్ రోర్ బిగిన్స్’ అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రెండు రోజుల ముందే ఈ క్రేజీ అప్డేట్తో ఫ్యాన్స్ను ఖుషీ చేశారు మేకర్స్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ చివరి దశలో ఉందని, త్వరలోనే మరిన్ని వివరాలను ప్రకటిస్తామన్నారు. మరోవైపు బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ2’ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ సోమవారం విడుదల కానుంది.